Sunday, February 27, 2022

ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతాలు

 అలం"కారాలు"

-----------------
నడ్డి మీద వడ్డాణం నెత్తి మీద పెట్టుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. అలంకారాలంటే అంతే మరి, ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి.
*
రామానుజాచార్యులు జగద్ గురువులు అంటే, అది సత్యం.
రామానుజాచార్యులు తప్ప ఇంకెవరూ జగద్గురువులు కాదు అనడం అనన్వయాలంకారం లా ప్రయోగించిన అతిశయోక్తి అలంకారం అనాలేమో !
నాకయితే తెలీదు, మీకు తెలిస్తే చెప్పండి.




ఇలాంటి అలంకారాలతోనే ఎడారి మతాలవారు మావోడు తప్ప ఇంకెవరూ లేరు అని రచ్చ లేపుతున్నారు !
*
జియర్ స్వామి మాటల్లో ఎక్కడా ప్రత్యక్షంగా శంకరాచార్యులు జగద్గురువులు కారు అనలేదు.
ఆయన ఉద్దేశం రామానుజుల వారి సమకాలిన గురువులతో పోల్చా, ప్రస్తుత కాలం లో గురువులను గూర్చా లేక నిజం గానే అందరితో పోల్చారా అన్నది స్పష్టంగా చెప్పలేము, కాబట్టి బంగారయ్య శర్మగారు, ఇతరులు కాస్త నెమ్మదించి, నేరుగా జియర్ గారినే సంప్రదించి మాట్లాడవలసింది.
ఆయనే తన ఉద్దేశం ఏంటో వివరించేవారేమో. తప్పుగా అనుంటే సవరించేవారేమో.
ఇలాంటి సమస్యలు కోర్టులు టివీ చానళ్ళు మధ్యవర్తిత్వం చెయ్యాల్సిన విషయాలు కాదు.
ఆది శంకరుల్లా శాస్త్రం తెలిసిన పెద్దలు వాదోపవాదాలతో నిర్ణయించాల్సినవి.
టీవీ చానల్ లో చాలెంజుల వల్ల టీవీ వాళ్ళకి, పాషాండ మతాల వారికీ తప్ప ఎవ్వరికి ఉపయోగంలేదు.
*
నీవు తప్ప దిక్కే లేదు అని గజేంద్రుడంటే, విష్ణువెళ్ళి కాపాడాడు. ఇంకెవరూ లేరంటావా అని , మధ్యలో శివుడికి కోపమొచ్చి శూలమేసి ఏనుగుని ఏమీ కొట్టెయ్యలేదు.
ఎందుకంటే శివవిష్ణువు లిద్దరూ ఒక్కటే !
ఎవరి దృష్ట్యానుసారం వారికి దర్శనం కలుగుతుంది !
మా అమ్మ పడినంత కష్టం ఎవరూ పడరు, మా అమ్మ త్యాగమూర్తి, ఎంతో కష్టపడి మా అందరిని పెంచింది అంటారు. నిజానికి అలా అన్న వాడికి తన తల్లి ప్రేమ మాత్రమే అనుభవం. ఇతరుల తల్లుల ప్రేమ ఎంతటిదో వాడికి తెలియదు. కేవలం తన తల్లిని పొగిడే ప్రయత్నం లో అలా అంటాడు. ఇదీ అంతే !
*
అయితే మధ్యలో మనుషులే మనోభావాలు దెబ్బతినేసి గొడవలుపడతారు.
కడుపు చించుకుంటే కాలిమీద పడుతుంది.
గోతి కాడ నక్కల్లా, హిందువులు ఎప్పుడు కులం గురించి గొడవపడతారా,
ఎప్పుడు దేవుళ్ళ గురించి గొడవపడతారా అని వేచిచూసే వారున్న ఈ రోజుల్లో, వేదికలెక్కి విమర్శించుకోవడం హైందవానికి మంచిది కాదు.
*
ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతాలు చెప్పేది
ఒక పరమ సత్యమే,
చేర్చేది ఒక తీరమే !












🙏




ఆకలి

Toast Masters speech

Path : Presentation Mastery

Level : Level 1 Project 3 - Research & Present

Title : ఆకలి

మొన్న బాపూ గారి కార్టూన్ ఒకటి చూసాను.

"డాక్టర్ మనం భోజనం ఎప్పుడు చేస్తే మంచిది?" ఒక రోగి అడిగాడు.

"లేని వాడయితే దొరికినప్పుడు 

ఉన్నవాడయితే తిన్నదరిగినప్పుడు", డాక్టర్ సమాధానం !

*

వినడానికి హాస్యమనిపించినా, నిజమే కదా?

ఆకలి ఉన్నవాడిని లేని వాడిని పూర్తి విరుద్ధంగా బాధపెడుతుంది.

*

యువల్ నొవ హరారి - సేపియన్స్ పుస్తకం ప్రకారం

3.5 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద జీవ జాతులు పుట్టాయి

60 లక్షల సంవత్సరాలక్రితం లూసీ అనబడే మన అందరి ముత్త మామ్మ పుట్టింది

3 లక్షల సంవత్సరాల క్రితం అగ్నిని రాజేసి, ఇతర జీవులను భయపెట్టి, తిండిని పచనం చెయ్యడం మొదలు పెట్టాం

12000 సంవత్సరాలక్రితం వ్యవసాయం, జంతువుల పెంపకం మొదలు పెట్టాం

5000 సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద రాజ్యాలు ఏర్పడ్డాయి

మనకు మనం పెట్టు కున్న శాస్త్రీయ నామం హోమో సేపియన్స్.

అంటే వివేక వంతులు అని.


ముందు 12000సంవత్సరాలు వదిలెయ్యండి కనీసం ఈ 5000 వేల సంవత్సరాలలో 

మనం ఒకరితో ఒకరు కలిసి సామరస్యంగా బతకడం నేర్చుకోలేకపోయాం.

ఆకాశం , భూమీ, గాలి, నీరు అందరికీ సమానం అని  గుర్తించలేకపోయాం.

మనం,నిజంగా వివేక వంతుల మేనా?

*

పోషకాహార లోపం:

2021 వరల్డ్ హేల్త్ ఆర్గనైసేషన్ 82 కోట్ల మంది పోషకాహార లోపం తో బాధ పడుతున్నారు.

వారిలో పిల్లలే ఎక్కువ - 60% మంది.


పోనీ పంటలు పండ లేదా అంటే

1. ఏక్షన్ ఎగైనస్ట్ హంగర్ అనే సంస్థ లెక్కల ప్రకారం, భూమి మీద ప్రతి ఒక్కరి ఆకలి తీర్చడానికి అవశరమైన దానికన్నా ఎక్కువ పంటే పండుతోంది.

2.రైతులూ, పసువుల కాపర్లూ, చేపలు పట్టేవారు ఇలాంటి చిన్న చిన్న వృత్తుల వారు నికర ఆహార ఉత్పత్తిలో 70% శాతం వాటా కలిగి ఉన్నారు. కానీ వారే ఎక్కువ పోషకాహార సమస్యతో బాధపడుతున్నారు.

3. యుద్ధాలు , అంతర్జాతియ సమస్యల వల్ల 23 దేశాల్లో 99 కోట్ల మంది ఆహార సమస్య ఎదుర్కుంటున్నారు

4. ప్రస్తుతం పౌష్టికాహార లోపం వచ్చిన పిల్లల్లో కేవలం 25% మందిని మాత్రమే కాపాడుకోగలుగుతున్నాము. ఈ పాపం ఎవరిది?

మనం, నిజంగా వివేక వంతుల మేనా?

*

ఊబకాయంతో

విచిత్రం ఏమిటంటే,

వరల్డ్ హేల్త్ సంస్థ 2016 లెక్కల ప్రకారం, 200 కోట్ల మంది అధిక బరువు ఉన్నారు. అందులో 65 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. 8% శాతం పిల్లలు ఊబకాయులు.

ముఖ్యంగా అభివృద్ధి చెందిల దేశాల్లోనే ఎక్కువ శాతం ఈ ఊబకాయులు ఉన్నారు.

అనారోగ్య సమస్యలు పక్కన పెడితే, ఈ ఊబకాయ సమస్యకు కారణం పనికి తిండికి పొంతన లేకపోవడం.

టైంస్ ఆఫ్ ఈండియా ప్రకారం India లొ ఇదివరకటి కన్నా 29 శాతం ఎక్కువ  పిల్లలు అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారు

మనం, నిజంగా వివేక వంతుల మేనా?

*

వాళ్ళు తినడానికి లేకపోతే అందులో మన పాత్ర ఏమిటీ అంటే,

United Nations Environment Programme (UNEP) - లెక్కల ప్రకారం 2021 లో అవసరమైన దానికన్నా ఎక్కువ ఆహారోత్పత్తి జరిగింది కానీ, 17% ఆహారాన్ని వృధా చేసాం.


మనకు బుల్లేట్ రైళ్ళు ఉన్నాయి, అంతరిక్షంలో కేళ్ళే రోదసి నౌకలున్నాయి.

సాటి మనిషికి తిండి తీసుకెళ్ళే వాహనాలు లేవు

పేద దేశాలకు తిండి పంపేందుకు సమయం లేదు.

ఎందుకంటే 

కార్పరేట్లకు అక్కడ లాభం లేదు

శాస్త్రవేత్తలకు అక్కడ పేరు లేదు

సామాన్యుడికి పట్టించుకునే తీరిక లేదు

మనం, వివేక వంతుల మేనా?

*

అడవిలో జంతువులు కూడా పంచుకుని తింటాయి. 

సింహాలు తినగా హైనాలు, హైనాలు తినగా, నక్కలు, నక్కలు తినగా రాబందులు, పిట్టలు, పురుగులు, చీమలు..

మరి మనమెలా ఈ పరిస్తితి  దిగజారిపోయాం?

*

నాకు తినడానికి ఏమైనా ఉందా?

నాకు తినడానికి ఇంకా ఏమైనా ఉందా?


మరి మనం, వివేక వంతుల మేనా?

*

జిడ్డు కృష్ణ మూర్తి గారి మాటల్లో,

అత్యాశ, అసూయ, ద్వేషం, సొంతం చేసుకోవాలనే ప్రవృతి వల్ల ఆకలి అనే సమస్య ఏర్పడుతోంది.

ఆకలిని అంతం చెయ్యాలనే అంతర్గత విప్లవం రానిదే ఆర్థీక విప్లవం అర్థ రహితమే.

మనం మన 17% వృధాని ఆపాలి.

8 శాతం ఊబకాయాన్ని నిర్మూలించాలి.

కాస్త స్వార్ధాన్ని తగ్గించుకోవాలి, అప్పుడే ఆకలిని నిర్మూలించగలం.