Showing posts with label తెలుగు రచనలు. Show all posts
Showing posts with label తెలుగు రచనలు. Show all posts

Tuesday, January 2, 2024

అన్నపూర్ణి అనే పూర్ణ పాపిష్టి సినిమా

15 కోట్లు పెట్టి తీసి, 5.5 కోట్లు సంపాదించి(7-8 కోట్లు బొక్క), 2.3 రేటింగు ఉన్న ఒక హిట్టు సినిమా గురించి సర్కాస్టిక్ పోస్టు.

*

ఒక వెనుకపడిపోయిన లేడీ సూపర్ స్టార్, తిరిగి ట్రాకులో పడాలంటే, 

మెజారిటీలయినా నోరువిప్పని కొన్ని మూగ మనసుల్ని రెచ్చ గొట్టి సినిమా ఎలా ఆడించాలి, 

ఆ లేడీ 75వ చిత్రం కేడి లా ఆలోచించి కధ ఎలా రాయాలి.?

ఎలా అంటే,


*

బామ్మర్లమ్మాయి, గుళ్ళో ప్రసాదం తయరు చేసే ఆయని కూతురు.

చిన్నప్పటి నుండి వంట బాగా చేస్తుంది, వంటగత్తె కావాలనుకుంటుంది.

నాన్వెజ్ గొడవ ఎందుకు మనకు వద్దు అంటాడు తండ్రి.

అంత వంటలక్క అయిన అమ్మాయి కి క్లారిటీ ఉంటుంది, 

"షెఫ్ఫుల్లో వెజ్జు షెఫ్ఫులూ ఉంటారూ, కేవలం వెజ్ కోర్సులూ ఉంటాయీ" అని చెప్తుంది అని అనుకుంటారు మీరు, 

కాని అలా చెప్పదు, జస్టు బాధ పడి ఊరుకుంటుంది. ఇది ఒక ట్విస్టు.


అప్పుడు కనిపించని దేవుడిలా, FARHAN అనే మితృడు వచ్చి అక్షరాలా 

"ఇన్నాళ్ళూ నీ తల్లి తండ్రుల మాట విని సమయం వృధా చేసుకున్నావు, ఎన్నాళ్ళని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటావు, హొటల్ మేనేజ్ మెంట్ కోర్సుకు అప్లయ్ చెయ్ అంటాడు", వాడి మాట వింటుంది, వాడే వద్దని చెప్పినా. ఇదొక జోకు, ఇక్కడ నవ్వాలి మీరు.

ఆవిడకు వంట కావాలి, ఈయనకు వంటగత్తె కావాలి. 

వాడూ అమ్మాయి కోసం, కోర్సు జాయిన్ అవుతాడు, తరువాత మామూలుగా ఫ్రిడ్జులో చికెన్ పీసుల మధ్య దొరుకుతుందని మీరు అనుకుంటారు, కాని అలా కాదు, ఇది ఇంకొక ట్విస్టు.

అప్పుడూ, ఆ అర బుర్రది, కాదు కాదు అసలు బుర్రలేని, 

చికన్ కొయ్యబోయి కళ్ళు తిరిగిపడుతుంది మన అగ్రహారం అన్నపూరని.

*

మళ్ళీ అదృశ్య దేవుడు ప్రత్యక్షం, ఫర్హాన్ కర్మ గీత,

"కస్టమర్లే దేవుళ్ళూ, అయ్యప్ప మాల వేసుకున్నా మాంసం అమ్మరా?" అంటాడు.

అప్పుడు మన అరకోడి, సారి అగ్రహారం అమ్మాయి "అయ్యో, మాదసలే క్లాసికల్ ఫామిలీ" అంటుంది.

అప్పుడు ఫర్హాన్ ఇలా బోధిస్తాడు,

"అత్ర తత్ర మత్ర, తత్ర మత్ర గత్ర, మచ్చ చస్వమత్ర" కాబట్టి రాముడూ లక్షణ్ భాయ్ Non-Veg తిన్నారూ,

మురుగన్ జంతువుల్ని వేటాడే వాళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు(మనసులో ఆల్మోస్టు నాన్ వెజ్జు తినే ఉంటాడు),

కన్నప్ప శివుడికి పంది మాంసం పెట్టాడు (అందుకే మాకు పంది పడదు)

కాబట్టి ఏ దేవుడూ VEGETERIAN కాదు, 

SO నువ్వు ఏం తినాలో చెప్పడానికి ఎవరూ సరిపోరు , నువ్వు నీ ఇస్టాన్ని బట్టి తిను" , 

అని రామబాణం వేసి, శివ పినాకం తో ఒక్కటి పీకుతాడు, ఫర్హానావధాని.

దెబ్బకి ఆగ్రహారం అమ్మాయి కళ్ళు కుక్కర్ విసిల్లా తెరుకుంటాయి.

నువ్వు కుక్కవడమే నాకు సంతోషం అంటాడు.

అప్పుడా కుక్కి కోడిని ముక్కలు ముక్కలు చేసి చూపిస్తుంది. అదృశ్య గీత పని చెయ్యకమానుతుందా?

.

తినకుండా వండడం ఎలా?

అందుకని గుడ్డు తినడంతో మొదలయ్, దానమ్మ అమ్మమ్మలను, నడీచేవి,ఈదేవి కూడా లాగించేస్తుంది, మద్యలో కొన్ని తండ్రిగారి ముక్కు మూసుకునే పూజలు మిక్స్ చేసి, మాల వేసుకున్నవాళ్ళని చూపించారు, మసాలా తగలాలిగా.


మసీదులోంచి వచ్చిన ఫర్హాన్ మరియు మన మణిహారం ఒక తౌడు గిన్నె పై మూత అంత ప్లేటులో లో ఫర్హాన్ అమ్మ బీబీ వడ్డించిన బీఫ్ బిర్యాని తింటుంది, మీరిక్కడ నుంచే ఏదో లవ్జిహాద్ మొదలవుతుంది అనుకుంటారు, కాని రంగరాజనుగారికి చికెన్ తింటున్న చిన్నారి కూతురు చిక్కిపోతుంది.

అప్పుడు కర్కోటక బ్రాహ్మణులు రంగరాజను గారిని ప్రసాదం చెయ్యొద్దంటారు.

కట్ చేస్తే కోడిని తిన్న కోమలికి నిలువ బొట్టు శేకర్తో కల్యాణం కుదురుస్తారు.


మళ్ళీ  ఫర్హానుడొస్తాడు (FARHAN alias HERO alias SANGHA SAMSKARTA). 

అగ్రహారం అమ్మాయి నాన్నమ్మ, "ఈ మడి ఆచారం సాంప్రదాయాల వల్ల నేను ఆటక మీద ట్రంకు పెట్టెలా ఉండిపోయా, నువ్వన్నా వెళ్ళి ఐసు పెట్టెలో.. కాదు కాదు, గెలువుపో" అంటుంది. వాళ్ళిద్దరూ (FARHAN & AP) చెన్నై జంపు.

బయటకు వెళ్ళి పిల్ల జంపు విథ్ జిలాని అని చెప్తుంది అభినవ ఆటక మీద ట్రంకు మామ్మ.

అలా శ్రీరంగం నుండి చెన్నై చేరిన అన్నపూర్ణి, పూర్ణంగా కోడిల్ని కుక్కల్నీ ఎలా వండుతుందో, ఎలా ఎదుగుతుందో అన్నదే కధా వస్తువు.

ఫర్హానుడు రంగాచారి ప్రదిక్షణాలు సరిగ్గా చెయ్య్లేదని చెప్పడం హైలైటు, ఇలాంటి సీన్లు ఎన్నో ఎన్నెన్నో..సీన్ టు సీన్ చెప్పెయ్యాలి, కాఫీ రైటు సమస్య వచ్చేస్తుంది.

హిందూ సాంప్రదయాలు ట్రాషు అన్న మామ్మ మాటవిని బొట్టు తీసేసి నమాజు చేస్తుంది, బిర్యాని చెయ్యలంటే బేబి హబిబి బిబి అవ్వాలి మరి. 

బాక్ గ్రవుండులో అలా ఇలా అని పాట వస్తుంటే బిర్యానిలో కూసింత ఉమ్మేస్తుందని మీరు అనుకుంటారు, కానీ అలా జరగదు, అగ్రహారం అమ్మాయిలు ఇంకా అలా చీకట్లోనే ఉండి టీవీ చూస్తుంటారు, కోడి తిన్న అగ్రహారం అమ్మాయి కత్తులు నూరి  కాంపిటీషన్ నగ్గేస్తుంది, అదే మరి కధలో మలుపు. 


మీరేమో ఇస్లాం గొప్ప అని తేల్చి చెప్పేస్తారు, సినిమాలో అనుకుంటారు

కాని చివర్లో మాత్రం బిర్యానీకి మతం కులం ఏంటి? బిరియాని ఒక ఎమోషన్ అని అంటుంటే, ముస్లిం అత్తగారు కళ్ళు తుడుచుకుంటుంటే ఆ ఎమోషనల్ సీను బాగా మిగల ముగ్గింది .

అన్నేళ్ళు దేవునికి ప్రసాదం తయారు చేసే మహద్భాగ్యం కలిగిన ఉద్యోగంలో/సేవలో ఉన్నవాడు, మూర్ఖుడిలా తెగ తెంపులు చేసుకు ఉండిపోతాడు అనుకుంటారేమో మీరు, చివరికి వచ్చేటప్పటికి సేవ కాదు కూతురి చికెన్ వంటే ముఖ్యం అనుకుని, ఆధునికునిలా నాగరికునిలా, కన్న కూతురు కళ్ళెదుటే నల్లగుడ్డేసుకుని నమాజు చేసి పోటీలో నగ్గితే ఆనందపడతాడు. అది సినిమా అంటే. 

.

సరే పోని ముస్లిము సంధ్యావందనమో

తురకోడి తిరు నామాలో

క్రిస్టియన్ ప్రసాదం తినడమో చూపిస్తారు అనుకునేరు , 

ఆశ దోస అప్పడం, అదేం కుదర్దు, తూచ్ పో. 

ఇస్లాం మనకు ముద్దు, హిందు వద్దు.



*

ఈట్ డ్రింక్ మాన్ వుమన్ , చెఫ్ఫ్, బరంట్,కుక్ అప్ ఏ స్టోర్మ్ లాంటి సినిమాలు మిక్సీ కొట్టెయ్యడమే, ఇంటర్వెల్ తరువాత రెండోవ భాగం !  

ఇక మిగతాది చూడాలంటే కప్పల కూర చూసినట్టు జుగుప్స కలిగి మానేసా.

నిజం చెప్పలంటే డైరక్టర్ని చెప్పుతో కొట్టే ఉద్యమం మొదలు పెట్టాలనిపిస్తుంది, ఆ బీపీ ఎందుకని మానేసా..

మనకెందుకులే, వెన్నెముకలు సద్దుకుని, మన ఆఫీసు పనులు మనం చూసుకుందాం !


NOTE: I am not against anyone eating NONVEG, its their choice, demeaning Hinduism to promote Islam is what is troubling in the movie. Not that i care for someone feeling bad, Just FYI.

Sunday, November 19, 2023

వేదాలే రాసిచ్చేసాయి, అవని అంతా ఆమేనట అతనేమో ఆకాశం !

 వేదాలే రాసిచ్చేసాయి,

అవని అంతా ఆమేనట

అతనేమో ఆకాశం !

.

పుట్టినా గిట్టినా అంతా ఆమె ఒడికే

ఆకాశానికేం గిట్టింది?

వర్షం కురిపించడం

ఉరుములు ఉరమడమన్న బాధ్యత తప్ప !

.

నాగరికత పేరు చెప్పి

ఆమే చుట్టూ కాపు గా ఉండమని

కాపాడే కోటగా మారమని

*

కుంటి, గుడ్డీ, చెముడూ, మూగా

వెర్రీ, మొర్రీ సమస్య ఏదైనా కాని

ఉద్యోగం పురుష లక్షణమని చెప్పి

సంపాదన కోసం వీధిలోకి పొమ్మనీ

*

యుద్ధాలకు పంపి, సరిహద్దుల్లో నిలిపీ

పోయిన ప్రాణాలకు

వీరుడనీ ధీరుడనీ పదాల కానుకిచ్చీ

*

ఇంట గెలిచి వీధిన గెలవమని

ఇంటా బయటా గెలుపు కోసం పాకులాడమనీ

ఇంట్లో ఇత్తడి చెంబు గొడవనుండి

ఇలపై పడే ఉల్కల సమస్య దాకా అన్నిటికీ

మగవారినే తప్పు పట్టినా


మనిషి తెలివి, మగాడిని

వీధిలో వెలిగే దీపం చేసినా 

బాధ్యత అంతా భుజస్కందాలపై వేసుకుని

ఏమీ సమస్య లేనట్టు

పడక్కుర్చిలో , కాలు మీద కాలు వేసుకుని

రాజసంగా కూర్చునే కేసరులందరికీ

అంతర్జాతీయ మగాళ్ళ దినోత్సవ శుభాకాంక్షలు !


#InternationalMensDay

Saturday, July 1, 2023

ఊరి గాయం - శీర్షిక : ఇంద్రప్రస్థం

 ప్రతిదినం పద/వాక్య కవిత్వ పోటీకి

అంశం : ఊరి గాయం
శీర్షిక : ఇంద్రప్రస్థం
.
ద్రౌపదికి జరిగిన అవమానానికి,
దుర్యోధననుని దురభిమానానికి
దుశ్శాసనుని దుష్కర్మకు,
కర్ణుని దుర్నీతికీ కర్మఫలంగా
కురు వంశ పతనానికి సాక్షి,
ఈ ఇంద్రప్రస్థం !
ధర్మం వైపు నువ్వుంటే, దైవం నీ వెంటే, అని దారి చూపి,
బతకుమార్గాన్ని గీతలు గీసి చూపించిన
శ్రీ కృష్ణుడి పాదాలు మోసిన పట్టణం,
ఈ ఇంద్రప్రస్థం !
ఆనాటి నుండి ఈనాటి దాకా,
ఎంతో మంది వీరులు,
ఎన్నెన్నో గాధలు వీక్షించిన విజయ కేతనమీ రాజ్యం !
*
అంతటి మహోన్నత ఊరికి గాయమయ్యింది
చీర లాగినందుకే కురు వంశాన్ని చెరిపేసిన రోజులనుండి,
చెరచి చంపేస్తే,
చిన్నవాడని చెప్పి
చీరలు కుట్టుకొమ్మని కుట్టు మిషనులు ఇచ్చే
పరిస్థితులు వచ్చినందుకు,
ఊరి గుండెకు గాయమయ్యింది

ఏ నేలపై కృష్ణుడు తిరుగాడాడో
ఏ ఊరి వీరుడు కీచకుడిని వధించాడో
ఆ ఊరి వీధులలో తిప్పుతూ
ఆమెను వికృతంగా వేధించి కడతేర్చారని
ఊరి మనసు ముక్కలై రోధించింది
*
ఒక పిల్లవాడిని పెంచడం, ఒక ఊరి బాధ్యత
ఈ కీచకులను పెంచిన నేరం నాదేనంటూ
మూగ సాక్ష్యంగా మిగిలిపోవడం
తప్ప మరేమి చెయ్యలేని
ఇంద్రుని నగరం కూలబడిపోయింది



ఏ ఇంద్రజిత్తుని జిత్తులు తగిలెనో
ఏ కలి పురుషుని నీడబడెనో
ధర్మం వైపు నిలబడలేని నిస్సహాయతతో
నిర్జీవమైపోయిన నిర్భయ ముందు తలవంచుకుంది
అటువంటి కీచకులను కన్న,
ప్రతి ఊరి గాయానికి ప్రతీకగా !

Friday, June 23, 2023

అంశం: ఏమని చెప్పను? శీర్షిక: చతుర్ముఖ బ్రహ్మ

 అంశం: ఏమని చెప్పను?

శీర్షిక: చతుర్ముఖ బ్రహ్మ

*

ఏమని చెప్పను? ఎంతని వివరించను?

మూడు యూగాలుగా నే ముచ్చట పడి కట్టుకున్న

ఈ భువనాన్ని, మూణ్ణాళ్ళ ముచ్చట చెయ్యొద్దని?



*

యుగానికొక దేవుడిని దింపి

దారితప్పిన రాక్షసులను పైకి పంపి

యుక్తి కోసం వేదాలు కూర్చి

శక్తి కోసం మేధస్సు నిచ్చి

తల్లి తండ్రి తానై లాలించే

ప్రకృతి ఒడిలో ఉయ్యాలలూపితే..

-

దేవుడిని గుడిలో వదిలేసి

రాక్షసుల బాటలో అడుగేసి

వేదాలను త్యజించి

మేధస్సును దురాశకై వెచ్చించి

తల్లి తండ్రీ తానై పోషించిన ప్రకృతికి,

పేరాశతో పోట్లు పొడిచి,

సహోదరుల్లా బతకాల్సిన,

నా సృష్టిలో భాగాలు, నా పిల్లలు

ప్రాణి కోటికి హాని చేస్తూ,

తమలో తాము తన్నుకుంటుంటే

ఏమని చెప్పను? ఎంతని వివరించను?

-

ఏడు కలికాలాలు చూసినా ఏముంది మార్పు?

బ్రహ్మలు మారడమే కాని మనుషులు మారునా?

కలికాలం సత్యయుగమై విలసిల్లునా?

ఏమని చెప్పను? ఎంతని వివరించను?

అష్టమ బ్రహ్మ నీ కదా, అన్నీ కష్టాలే అనుకుంటా

తొమ్మిదో బ్రహ్మ హనుమంతులవారికైనా

కలికాలంలో కాస్త ఊరట కలగాలని కోరుకుంటా !


Friday, May 13, 2022

హిందువులకు అత్యంత పవిత్రమైన గుళ్ళ పై ఆ ఏహ్య భావ చిహ్నాలను ఇంకా ఉంచాలా?

 ఇప్పుడు కాశీలో దేవాలయంపై కట్టిన జ్ఞాన్ వాపి మసీదు సమస్య మొదలు.

.
ముష్కరులు మన దేశంపై పడి, మన గుళ్ళను దోచుకుని,
వారి బలానికి,
ఇతర మతాలపై వారికి గల చులకన భావానికి చిహ్నంగా,
తర తరాలు గుర్తుండి పోయేలా మన గుళ్ళ పై వారి మసిదులను కట్టారు.
మరి హిందువులకు అత్యంత పవిత్రమైన గుళ్ళ పై ఆ ఏహ్య భావ చిహ్నాలను ఇంకా ఉంచాలా?
సున్నం వెయ్యని హిందూదేవాలయ స్తంబాలు ఆ అణచివేతను గుర్తు చేసి వెక్కిరిస్తుంటే సహించాలా?




సరే ఇవాళ జ్ణానవాపి మసిదు కూల్చి విస్వనాధుని గుడి స్వాధినం చేసుకుంటాం.. మరి రేపు ఇంకొక గుడి మీద కట్టిన మసీదు సమస్య వస్తే?
జనాలు ఇలా గొడవలు పడుతూ ఉంటే మత సామరస్యం, అభివృద్ధి ఎలా సాధ్యం?
.
మన దేశంలో గుళ్ళపై కట్టిన అన్ని మసీదులు కూల్చాలంటే,
తరాలు గడిచి పోతాయి,
ఎంత శాతం పురాతన మసీదులు మిగులుతాయన్నది ప్రశ్నార్ధకమే.
పై పెచ్చు జనాలు కొట్టుకు చస్తారు.
నాయకులు వోటు బేంకుల కోసం వాడుకుంటారు.
ఇది హిందువులు అలోచించాల్సిన విషయం.
.
అటు ముస్లిములు ఒక అడుగు ముందుకు వేసి,
మసీదులు వారికి పవిత్రం కాదు కాబట్టి అవి కేవలం మీటింగ్ హాల్స్ లాంటివే కాబట్టి,
చర్చలకు సిద్ధం,
సామరస్యంగా పరిష్కరించుకుందాం,
ఇందులో ఇతర ఉమ్మా (వెరే దేశ ముస్లిములు) కల్పించుకోకుండా చూసుకుంటామని హామి ఇవ్వగలగాలి.
.
ఇరు వర్గాలు కూర్చుని భారత దేశం మొత్తంలో ఒక 50 గుళ్ళు హిందువులకు ప్రాముఖ్యం అనుకున్నవి నిర్ణయించుకుని,
అక్కడ మసీదులు నిర్మూలించి గుళ్ళని పునః స్థాపిస్తే,
హిందువులు ఇతర గుళ్ళ విషయంలో రాజీ పడితే,
ఈ సమస్య వచ్చే తరానికి అంటుకోకుండా ఉంటుంది.
.
సెక్యులర్ జనాలు, కాస్త ఇరుపక్షాల మనోభావాలను గుర్తెరిగి, శాశ్వత పరిష్కార దిశగా తమ మద్దతు తెలపాలి.
.
లేదంటే ఇంకొక అధ్భుతమైన ఉపాయం ఉంది 🙂 (ఐతే ఇది జరగని పని, వారికి వారి ప్రార్థనా స్థలాలను ఎంత గొప్పగా కాపాడుకుంటారో బాగా తెలుసు ) .
అబ్రహామిక్ మతాల ప్రముఖ ప్రార్థనా స్థలాలు.. అంటే మక్కా మదినా, జెరుసలెము వంటి ఒక 50 మందిరాల లోగిలిలో అంతే వైభవం గా హిందూ గుళ్ళను నిర్మించి
మాకు మీ మతం అంటే ఎటువంటి ఏహ్య భావం లేదు అని తమ అభిమతాన్ని వ్యక్తీకరిస్తే,
హిందువులకు హజ్జ్ యాత్రలాంటి యాత్రకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తే...సమస్య తీరుతుందేమో !!!
ఏమంటారు???


अयोध्या मथुरा माया काशी काञ्ची अवन्तिका ।
पुरी द्वारावती चैव सप्तैते मोक्षदायकाः ॥
.
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా
పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్ష దాయకాః
- గరుడ పురాణం
.
సనాతన ధర్మానుచరులకు మోక్ష దాయకమైన సప్త పురాలు - అయోధ్యా, మథుర, హరిద్వార్, కాంచిపురం, ఉజ్జయిని, ద్వారకా. వీటిని కట్టు దిట్టం చేసి మళ్ళీ ఎటువంటి ఆక్రమణ (భౌతికంగా, ధర్మ పరంగా, వ్యాపార పరంగా.. అన్ని విధాలుగా) జరగకుండా కాపాడుకోవడం మన బాధ్యత.
.
ఒక సారి జరిగితే పొరపాటు,
మళ్ళీ మళ్ళీ జరుగుతుంటే అమాయకత్వం, అలసత్వం, బలహీనత్వం.



యుద్ధం ముగిసాకా యుద్ధ ఖైదీలకు విముక్తి లభిస్తుంది, మరి మా గుళ్ళకు విముక్తి తెచ్చుకోవడం తప్పా?
లేదా యుద్ధం ఇంకా కొనసాగుతోందనుకుంటున్నారా?



అరచేతిలో అమృతం ఉంటుంది అని చెప్పేవారు చిన్నప్పుడు

 అన్నం అరచేతికి తగిలెలా కలుపుకోవాలని, అరచేతిలో అమృతం ఉంటుంది అని చెప్పేవారు చిన్నప్పుడు.

కేవలం మునివేళ్ళకు తగిలేలా అన్నం కలుపుకు తింటే ఒప్పుకునేవారు కాదు ఇంట్లో.
.
బ్రిటిషు వాళ్ళు పోయినా, ఇంకా వారి పాదదాసులు కొంతమంది మాత్రం పలుగు పార పట్టుకుని తినడమే గొప్ప,
చేత్తో తినడం అనాగరికం అనుకుంటున్నారు.




అసలు ఈ నాగరికత పేరు చెప్పే దేశాలు అన్నీ మత మార్పిడి చేసేసారు ముష్కరులు.
హిందూ దేశంలో హిందుత్వ అనేది చెడ్డ మాటగా, సెక్యులర్ అంటే వెన్నెముక లేకపోవడంగా, తెల్లోళ్ళు ఎం చెస్తే అదే గొప్ప నాగరికత అని జనాలు అనుకునేలా తయారు చేసారు .
కడుక్కోడానికి మంచి నీళ్ళు లేవు కబట్టి ఎడారోళ్ళు, ఎంగిలిపీసోళ్ళ పద్దతులు అలా ఏడిసాయి.
నదీ పరివాహక ప్రాంతాల్లో పరిఢవిల్లిన మన ఆచారాలు శుభ్రంగా కడుక్కొమంటాయి, చేతులు.
చేత్తోనే తినమని చెప్తాయి.
.
సరే ఇప్పుడు మన వేదాలు చెప్పాయనో , ఆచారాలు ఘోషిస్తున్నాయనో చెప్తే మూఢ నమ్మకం కాబట్టి, గూగుల్ తల్లిని అడగండి.
విదేశీ వర్సిటీలు రీసెర్చులు చేసేసాయి, పేటెంటు తీసుకోవడమే తరువాయి.
.
వారు పేటెంటు తీసుకుని, ఎవో చేతికి రాసుకునే లెపనాలు కని పెట్టి , ఆ చెత్తో తినమని చెప్పేదాకా ,
అరిటాకులు వాడండి, అరచేతికి తగిలేలా కలుపుకు తినండి !
ఆరోగ్యానికి మంచిది !

ఇనప సామానుతో తినే తెల్లోళ్ళు ఆరోగ్యంగా లేరా అంటే.. ఉన్నారు, కావాలంటే కరోనాని అడగండి.


Wednesday, May 4, 2022

రోళ్లు బద్దలయినా , రాళ్ళు కరిగిపోయినా అవకాయ పెట్టనిదే ఎండాకాలం అవ్వదు

ఇయ్యాల రంజాన్ శెలవు, అక్షయ తృతియ, పరశురామ జయంతీ కలిపొచ్చాయండీ. 

ఐతే మాకు ఓ ఎగస్త్రా పండగ కూడొచ్చేసిందండీ బాబు, ఆవకాయ పండగ.

.

ఆవకాయంటే ఆషామాషీ కాదండే. 

ఆవకాయంటే సంవత్సరం మొత్తానికి ఇన్స్యూరెన్సు.

మొన్న వాట్సప్పు లో సూసానండీ,ఈ రాకెట్టుల్లో పైకెళ్ళే ఓళ్ళూ బూమ్మిదున్నప్పుడే పళ్ళు, కూరలు, కక్క ముక్క అన్నీ ఎండబెట్టేసేసి డబ్బాల్లో ఉప్పేసి ఊరగాయల్లా ఆడకట్టుపోతారంటండీ. 

అక్కడ పంటలుండవు కదండీ, ఈ డబ్బాల్లో తిండేండీ మరి ఆళ్ళకి. 

.

మరి మన తాతల్నాడే ఇయ్యన్నీ కనిపెట్టేసారు కదండే ?

కరువులొచ్చినా, గోదారికి వరదలొచ్చినా, 

యుద్ధాలొచ్చినా, ఇంటికి ఏళ కాని ఏళ సుట్టాలొచ్చినా, 

రోజుల తరబడి ప్రయాణాలొచ్చినా 

కరోనా కొత్త రకాలతో లాక్డవున్ వచ్చినా

ఊరగాయ జాడిలుంటే కొండంత దైర్నం కదండే?

.

ఉప్పేత్తావాండి, కారవండే, ఆవాలు , పప్పు నూనె , మాడి కాయలు .. ఇంతకన్నా కష్ట కాలం పొయ్యేదాక బలం ఇచ్చే తిండేవుంది సెప్పండి?

ఏడేడి అన్నవ్లా ఆవకాయి లాగించేసి, తరవాత ఓ నాలుగు ముద్దలు పెరుగన్నం తినేహేత్తే తిరుగుంటదాండీ?

ఏదో ఉప్పు కాయే కదా అంటారేమో, ఆవకాయ కుదరాలంటే సెయ్యి తిరిగుండాలండే.

.

ఇయ్యాల పొద్దునే ఆరింటికల్లా మార్కెట్ కెల్లి, పుల్లని పీసున్న సిన్న రసాలు ఎతుక్కుని బేరవాడెవండీ. 

ఆడూ కాయోటీ 30/- అన్నాడండి.

నేను అంతయితే కష్టం ఇంకో కొట్టు సూసి ఒత్తా అన్నానండి.

ఆడు మా ఇంటీకి వచ్చాక ఇంకో ఇంటీకి బోజన వెట్టకుండా ఎలా పంపేత్తావండీ, మీరెంతంటారూ అన్నాడండి. 

సరే ముక్క కొట్టిచ్చేలా బేరవాడి టోకున డబ్బులిచానండె.

మాంచి ఎటకారాలాడుతున్నావ్ ఏవూరేటీ నీది? అన్నానండి

తీరా సూత్తే ఆడు మన భిమారం ఓడు.

సరిపోయింది.. మాది సింతలూరే అన్నానండి.

ఆడు అవిసయిపోయి సింతలూర్లో ఎక్కడా అన్నాడండి. 

మన పెద్ద రావి సెట్టు పక్కనిల్లు, నీకు తెలుసేటి అన్నానండీ. 

ఆడు అయ్ బాబో తెలీపోటవేటండి పెతి  సంస్రం తీర్తానికి కజురం బండి ఎడతావండి , రావి సెట్టు దెగ్గర పైపు లోనే నీళ్ళు తీసుకెల్తావండీ అన్నాడు. 

పొద్దెక్కి పోతందని పనిలో పడ్డావండి.

.

మా అత్తోరికి కూసింత సుబ్రం ఎక్కువండి బాబూ, డబ్బులుపోతే పోయాయని నాలుగు కిన్లే బాటిళ్ళు, ఓ మంచి బకిట్టూ అట్టుకేళ్ళానండీ. 

సరే ఆడితో కబుర్లు సెప్తూ వంద కాయలూ సుబ్బరంగా కడీగేసి మంచి పంచీ ముక్కతో తుడిసేసానండి.

ఆడేమో ఆవకాయ కత్తి పీటేసి, కాయికి 12 ముక్కలు కొట్టేహేడండీ. 

చాలా మంచి పనోడండి ఆడు, వందలో ఒక్క ముక్కా నలగిపోలేదండి.  

పైనో యాబై ఇచ్చా టీ తాగమన్నానండి. ఉండిపోయిన కిన్లే బాటిళ్ళు ఆడి కిచ్చి, ఎండన పడున్నావ్అ, ని తాగెయ్ మన్నానండి. 

.

ఆడించిన రాళ్ళుప్పూ, ఆవ పిండీ, ఏ ఎస్ బ్రాండు పప్పు నూనె, తెనాలి పాలింగువ కొనుక్కుని ఇంటి కొచ్చేహేవండీ. 

కరోనా కదండీ, ఇంటి కొచ్చి స్నానం చేసి టిఫిన్ తిని, పని మొదలేట్టావండి.

.

ముక్కలన్నీ ఆరబోసి, చీర ముక్కతో శుభ్రం గా తుడిసేసి, తౌడు గిన్నితో కొలిసేసామండి.

ఒక తౌడు గుండకి, తౌడున్నర ముక్కల సొప్పున ముందు గుండ కలిపేసుకున్నావండి.

గుండ లెక్కేమో ఒక కారానికి ఒక ఆవ పిండీ, అర ఉప్పూ కలపామండి. కూసింత మెంతులు , రెండు సిటికెడులు ఇంగువండీ.

పెద్ద ఆవాకాయ టబ్బులో గుండ కొలిసి పోసేసి, నూనెలో ముక్కలు తడిపి గుండలో కలిపేసేనండీ. పైన ఒక లీటరు నూనె పోసేత్తే ఎర్రగా నిగనిగ లాడిపోతూ మంచి ఆవకాయ ఓసనండి.

.

అదే కారం సేత్తో ఓ సారి దేవుల్లందరికీ సూపించేసి, 

ఆవకాయ ముక్కలు కలిపిన గిన్నిలో ఓ నాలుగు చెంచాలు పప్పు నూనె పోసి 

నా కారం సేతులతో ఏడేడి అన్నం కలిపి మళ్ళీ దేవుడికి సూపించేసి, 

అందరం తలో ముద్దా తిన్నావండి. 

అమృతం వంటే కారం గా కూడా ఉండొచ్చు కదా అని డౌటనుమానం ఒచ్చేహిందండీ బాబు. 

మూత  శుబ్రంగా చీరేసి పురుకోసతో కట్టేహేనండి.

మూడు నిద్రలయ్యాకా తీసి మళ్ళీ కలిపి ఉప్పు సూసుకుంటే సరిపోద్దండి. ఆడించిన ఉప్పూ అటూ ఇటు అవ్వుద్దికదండీ.

.

ఈడేంటీ ఆవకాయకి ఇంత కధ సెప్పేడు అనుకుంటారేమో, 

సూత్తూ ఉండండీ ఆడు ఎలన్ మస్కోడు 

అమెరికా ఆవకాయనో, 

మస్కు మాగాయనో కంపెనీ ఎట్టేసేసి, 

ఆకాశం లో తిరిగేటోళ్ళకి జాడీలూ పంపేసేత్తాడు.

మీరో కంపెనీ ఎట్టి ఆడు కొనే దాకా ఎయిటు సెయ్యండీ.



తర్వాత ఇంక కాలు మీద కాలేసుకునీ కూసోడమే.




రోళ్లు బద్దలయినా , రాళ్ళు కరిగిపోయినా అవకాయ పెట్టనిదే ఎండాకాలం అవ్వదు

Sunday, May 1, 2022

సాఫ్ట్ వేర్ కార్మీక సోదర సోదరీ మణులందరికీ కూడా శ్రామిక దినోత్సవ శుభాకాంక్షలు

పలుగు పార సుత్తి కత్తి పట్టి శారిరక శ్రమ చేసే కార్మీక సోదరులతో పాటు ... కాఫీలూ టీలూ తాగుతూ కంటి మీద కునుకైనా పడకుండా అపార్టుమెంటు వాచ్ మెన్ కన్నా పెద్ద సెక్యూరిటీ గార్డు మల్లే రాత్రికీ పగలుకూ తేడా లేకుండా పనిచేస్తూ . పిల్లలు డే కేర్లోనూ పెద్దలు సొంతూరులోను మొగుడూ పెళ్ళాలు లాప్టాపుల్లోనూ తామకంటూ ఏమీ లేనట్టు ఎప్పుడూ కస్టమర్ సెంట్రిక్ ఆలోచనలతో . ఆన్ సైట్లో ఉంటే అందరికీ దూరంగా ఆఫ్ షోర్లో ఉంటే నిద్రకు దూరంగా ఎప్పుడు ఎక్కడ ఉన్నా శుభకార్యాలకు దూరంగా వాట్సాప్ లో అభినందనల తో గూగుల్ పే లో బహుమతుల తో జీవితాన్ని గడీపే సుదూర జీవి . పే స్లిప్పుల లెక్కలు అర్థం కాని పసివారు హక్కులు బొక్కలు తెలియని బాల కార్మీకులు కొద్దిపాటి హైకుకే కొండంత మురిసిపోయే భోళా శంకరులు . మానవాళిని రోజు రోజుకీ మరింత వేగంగా మరింత సౌఖ్యంగా మరింత ఆనందంగా చూడాలనే తపనతో . ఎండ బదులు విటమిన్ డీ లు తిండి బదులు ఇన్స్టంట్ నూడిల్లు పని వారమంతా చెయ్యాల్సిన పనులు వారాంతమేమో చెయ్యలేకపోయిన పనులు చేస్తూ ఆరోగ్యాలను సైతం పణం పెట్టి . కీ బోర్డూ మౌసూ ధారులై సదా కంప్యూటర్ స్క్రీను పై దృష్టి నిలిపే నవయుగ మునిపుంగవులు నూత్న యుగ సారధులూ .

















మా సాఫ్ట్ వేర్ కార్మీక సోదర సోదరీ మణులందరికీ కూడా
శ్రామిక దినోత్సవ శుభాకాంక్షలు !

Sunday, February 27, 2022

ఆకలి

Toast Masters speech

Path : Presentation Mastery

Level : Level 1 Project 3 - Research & Present

Title : ఆకలి

మొన్న బాపూ గారి కార్టూన్ ఒకటి చూసాను.

"డాక్టర్ మనం భోజనం ఎప్పుడు చేస్తే మంచిది?" ఒక రోగి అడిగాడు.

"లేని వాడయితే దొరికినప్పుడు 

ఉన్నవాడయితే తిన్నదరిగినప్పుడు", డాక్టర్ సమాధానం !

*

వినడానికి హాస్యమనిపించినా, నిజమే కదా?

ఆకలి ఉన్నవాడిని లేని వాడిని పూర్తి విరుద్ధంగా బాధపెడుతుంది.

*

యువల్ నొవ హరారి - సేపియన్స్ పుస్తకం ప్రకారం

3.5 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద జీవ జాతులు పుట్టాయి

60 లక్షల సంవత్సరాలక్రితం లూసీ అనబడే మన అందరి ముత్త మామ్మ పుట్టింది

3 లక్షల సంవత్సరాల క్రితం అగ్నిని రాజేసి, ఇతర జీవులను భయపెట్టి, తిండిని పచనం చెయ్యడం మొదలు పెట్టాం

12000 సంవత్సరాలక్రితం వ్యవసాయం, జంతువుల పెంపకం మొదలు పెట్టాం

5000 సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద రాజ్యాలు ఏర్పడ్డాయి

మనకు మనం పెట్టు కున్న శాస్త్రీయ నామం హోమో సేపియన్స్.

అంటే వివేక వంతులు అని.


ముందు 12000సంవత్సరాలు వదిలెయ్యండి కనీసం ఈ 5000 వేల సంవత్సరాలలో 

మనం ఒకరితో ఒకరు కలిసి సామరస్యంగా బతకడం నేర్చుకోలేకపోయాం.

ఆకాశం , భూమీ, గాలి, నీరు అందరికీ సమానం అని  గుర్తించలేకపోయాం.

మనం,నిజంగా వివేక వంతుల మేనా?

*

పోషకాహార లోపం:

2021 వరల్డ్ హేల్త్ ఆర్గనైసేషన్ 82 కోట్ల మంది పోషకాహార లోపం తో బాధ పడుతున్నారు.

వారిలో పిల్లలే ఎక్కువ - 60% మంది.


పోనీ పంటలు పండ లేదా అంటే

1. ఏక్షన్ ఎగైనస్ట్ హంగర్ అనే సంస్థ లెక్కల ప్రకారం, భూమి మీద ప్రతి ఒక్కరి ఆకలి తీర్చడానికి అవశరమైన దానికన్నా ఎక్కువ పంటే పండుతోంది.

2.రైతులూ, పసువుల కాపర్లూ, చేపలు పట్టేవారు ఇలాంటి చిన్న చిన్న వృత్తుల వారు నికర ఆహార ఉత్పత్తిలో 70% శాతం వాటా కలిగి ఉన్నారు. కానీ వారే ఎక్కువ పోషకాహార సమస్యతో బాధపడుతున్నారు.

3. యుద్ధాలు , అంతర్జాతియ సమస్యల వల్ల 23 దేశాల్లో 99 కోట్ల మంది ఆహార సమస్య ఎదుర్కుంటున్నారు

4. ప్రస్తుతం పౌష్టికాహార లోపం వచ్చిన పిల్లల్లో కేవలం 25% మందిని మాత్రమే కాపాడుకోగలుగుతున్నాము. ఈ పాపం ఎవరిది?

మనం, నిజంగా వివేక వంతుల మేనా?

*

ఊబకాయంతో

విచిత్రం ఏమిటంటే,

వరల్డ్ హేల్త్ సంస్థ 2016 లెక్కల ప్రకారం, 200 కోట్ల మంది అధిక బరువు ఉన్నారు. అందులో 65 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. 8% శాతం పిల్లలు ఊబకాయులు.

ముఖ్యంగా అభివృద్ధి చెందిల దేశాల్లోనే ఎక్కువ శాతం ఈ ఊబకాయులు ఉన్నారు.

అనారోగ్య సమస్యలు పక్కన పెడితే, ఈ ఊబకాయ సమస్యకు కారణం పనికి తిండికి పొంతన లేకపోవడం.

టైంస్ ఆఫ్ ఈండియా ప్రకారం India లొ ఇదివరకటి కన్నా 29 శాతం ఎక్కువ  పిల్లలు అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారు

మనం, నిజంగా వివేక వంతుల మేనా?

*

వాళ్ళు తినడానికి లేకపోతే అందులో మన పాత్ర ఏమిటీ అంటే,

United Nations Environment Programme (UNEP) - లెక్కల ప్రకారం 2021 లో అవసరమైన దానికన్నా ఎక్కువ ఆహారోత్పత్తి జరిగింది కానీ, 17% ఆహారాన్ని వృధా చేసాం.


మనకు బుల్లేట్ రైళ్ళు ఉన్నాయి, అంతరిక్షంలో కేళ్ళే రోదసి నౌకలున్నాయి.

సాటి మనిషికి తిండి తీసుకెళ్ళే వాహనాలు లేవు

పేద దేశాలకు తిండి పంపేందుకు సమయం లేదు.

ఎందుకంటే 

కార్పరేట్లకు అక్కడ లాభం లేదు

శాస్త్రవేత్తలకు అక్కడ పేరు లేదు

సామాన్యుడికి పట్టించుకునే తీరిక లేదు

మనం, వివేక వంతుల మేనా?

*

అడవిలో జంతువులు కూడా పంచుకుని తింటాయి. 

సింహాలు తినగా హైనాలు, హైనాలు తినగా, నక్కలు, నక్కలు తినగా రాబందులు, పిట్టలు, పురుగులు, చీమలు..

మరి మనమెలా ఈ పరిస్తితి  దిగజారిపోయాం?

*

నాకు తినడానికి ఏమైనా ఉందా?

నాకు తినడానికి ఇంకా ఏమైనా ఉందా?


మరి మనం, వివేక వంతుల మేనా?

*

జిడ్డు కృష్ణ మూర్తి గారి మాటల్లో,

అత్యాశ, అసూయ, ద్వేషం, సొంతం చేసుకోవాలనే ప్రవృతి వల్ల ఆకలి అనే సమస్య ఏర్పడుతోంది.

ఆకలిని అంతం చెయ్యాలనే అంతర్గత విప్లవం రానిదే ఆర్థీక విప్లవం అర్థ రహితమే.

మనం మన 17% వృధాని ఆపాలి.

8 శాతం ఊబకాయాన్ని నిర్మూలించాలి.

కాస్త స్వార్ధాన్ని తగ్గించుకోవాలి, అప్పుడే ఆకలిని నిర్మూలించగలం.


Monday, December 21, 2020

నువ్వు ఎవరు? Who are you?

ఎవరు నేను ?!!

.

Joaquin Phoenix | Joker



నా శరీరం నక్షత్ర ధూళి,

నా జీవితం ఎన్నో సంభావ్యతల హేళి,

నా ఆలోచన నూతిలో కప్పల కేళి !

.

నాకు ముందు నేను లేను,

నా తరువాత నేను లేను,

నాకు స్పృహ ఉంటే నాకు నేను ఉంటాను,

లేదంటే కేవలం నా చుట్టూ వారికి ఉంటాను !

.

నా ఆలోచనలు ..

నాకు ముందు వచ్చిన వారివి, 

వాటి నుంచి నా చుట్టూ ఉన్నవారు నేర్చినవి ,

వారి వల్ల నేను అనుకున్నవి !

.

ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడ, 

నేను లేనప్పుడు కూడా ఉండేది/ఉంటుంది,

 మహా అయితే ఇంకోలా !

.

కాబట్టి నేను అంటే నా ఉనికి మాత్రమే..

నేనంటే నేను మాత్రమే !

.

మీరేమంటారు?

Saturday, September 5, 2020

ముల్లు కొన మీద మూడు మడుగులు - పురందర దాసుని పాట

 ముల్లు కొన మీద మూడు మడుగులు

రెండు నింపలేము ఒకటి నింపలేదు


నింపని దానిలో ముగ్గురు పనివాళ్ళు

కుంటివాళ్ళు ఇద్దరు కాళ్ళు లేనిదొకడు


కాళ్ళు లేని వాడివద్ద మూడు నల్ల గేదెలు

గొడ్డు గేదెలు రెండు దూడలేనిదొకటి


దూడలేని గేదెవద్ద మూడు బంగరు మూటలు

రెండు ఎప్పుడూ మిగలలేదు ఒకటి ఎప్పుడూ వాడలేదు


వాడని మూటకు ముగ్గురు సాక్షులు

ఇద్దరు గుడ్డివాళ్ళు ఒకరికి కళ్ళే లేవు


కళ్ళు లేనివాడికి మూడు రాజ్యాలు

బంజరు భూములవి రెండు జనాలు లేనిది ఒకటి


జనాలు లేని ఊరుకొచ్చె కుమ్మరివాళ్ళు ముగ్గురు

వంకర చేతులదిద్దరు చేతులే లేవు ఒకరికి


చేతుల్లేని కుమ్మరి చేసె మూడు కుండలు

కన్నాల కుండలు రెండు అడుగే లేదు ఇంకొకటికి


అడుగులేని కుండలో ఉండె మూడు గింజలు

ఉడకబడనివి రెండు ఉడికించనిది ఒకటి


ఉడికించనిదానికోసం వచ్చె ముగ్గురు చుట్టాలు

ఇద్దరు ఎప్పుడూ తినరు ఒకరికేమో ఆకలి లేదు


ఆకల్లేనివాడికి మూడు కర్ర దెబ్బలు

రెండు దెబ్బలు తగల్లేవు ఒకటేమో తగలదు

తగలని దెబ్బ తగలనివ్వు విఠ్ఠలా

మోక్షానికి దారిచూపు పురందరదాస విఠ్ఠలా !


పురందర దాసుని పాట, మీకేం అర్థం అయ్యిందొ చెప్పండి. నాకర్థమయ్యింది కింద రాసా, వీలయ్యింత అర్థమయ్యెలా బొమ్మలతో వివరించడానికి ప్రయత్నించా, భావంలో అక్షరంలో దోషాలుంటే మన్నించి మార్పు చెప్పమని ప్రార్థన ! 

                                                          ---XXX---XXX---

ముక్తి సాధన మనలోనే మన నుండే మన వల్లే మనం కోసమే పుడుతుంది, దానికి శోకం నుండి పుట్టిన ఆర్తి కావాలి. 
మనిషిగా ముక్తి సాధించడానికి చాలా మార్గాలున్నాయి, కాని ప్రాపంచిక పరిమితుల వల్ల మనం వాటిని అనుసరించలేము. 
వాటిని వివరిస్తూ చివరికి జ్ఞాన వైరాగ్య భక్తుల ద్వారా ముక్తినివ్వమని విఠ్ఠలుని కోరడమే ఈ పాట అంతరార్ధం ! 

1. ఉపమానాలన్నీ ":"  తో వివరించా. 
    ఉదా : సూది మొన : జీవి కి చిహ్నం

2. సంబంధాలన్నీ "->" తో కలిపా 
    ఉదా : స్థూల శరీరానికి 3 అవస్థలు - కౌమార, యవ్వన, వృద్ధాప్య. అందులో ముక్తి సాధనకు      అనువైనది యవ్వన శరీరం, అందుకే స్థూల శరీరానికి దానిని కలిపా.
    



పైన బొమ్మ ఒక సారి చూసి, క్రింది వివరణలోకి వెళ్ళండి, తరువాత మళ్ళీ బొమ్మ చూస్తే సంపూర్ణం గా అవగతమవుతుంది.

 ముల్లు కొన మీద మూడు మడుగులు, రెండు నింపలేము ఒకటి నింపలేదు
    

ఒక గుర్రపు వెంట్రుక తీసుకుని అందులో 10000 వంతు కొలిస్తే ఎంత ఉంటుందో, వేదాల ప్రకారం ఒక జీవి అంత ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముల్లు కొన మనలో ఉన్న జీవానికి ప్రతీక.

చెరువు అంటే భూమి+నీరు+మొక్కలు+జల చరాలు ఇలా చాలా చెప్పొచ్చు, మానవ శరీరం కూడా అంతే.

సూది మొన అంత జీవం పై మూడు మడుగులు (చెరువులు), అంటే ఆ జీవాన్ని అంచెలంచెలుగా వ్యక్త పరుస్తూ, ఉల్లిపొరల్లా కప్పి ఉన్న కారణ, సూక్ష్మ, స్థూల శరీరాలు.

స్థూల శరీరం లేకుండా, మోక్షం పొందని జీవానికి, విముక్తి కోసం సాధన చేసే అవకాశం లేదు. స్థూల శరీరం ఉన్న జీవేమో ప్రాపంచిక విషయాల్లో కొట్టుకుపోతూ సాధన చెయ్యక విముక్తి పొందటం లేదు. అందుకే రెండు చెరువులు నిండలేవు ఒక దానిలో నీరు నింపలేదు అని పురందరదాసు అంటున్నారు. 




* నింపని దానిలో ముగ్గురు పనివాళ్ళు, కుంటివాళ్ళు ఇద్దరు కాళ్ళు లేనిదొకడు
స్థూల శరీరం మూడు అవస్థలలో పడుతుంది. కౌమార, యవ్వన, వృధాప్య.
కౌమార దశ లో ఎం చెయ్యాలో తెలీదు, ఆటలు పాటలు తో గడిచిపోతుంది.
వృద్ధాప్యం శుష్కించి వ్యాధి మయం అయిన శరీరంతో ఏం చెయ్యలేక గడిచి పోతుంది.
ఇక యవ్వనం ప్రాపంచిక సుఖాలలో మునిగి తేలుతూ సాధన చెయ్యక గడుస్తుంది.
అందుకే పురందర దాసు కౌమార, వృద్ధ అవస్థలను కుంటి వారి గాను, ప్రయత్నమే లేని యవ్వన దశ ను కాలు లేని వాని గాను వర్ణించారు.

* కాళ్ళు లేని వాడివద్ద మూడు నల్ల గేదెలు, గొడ్డు గేదెలు రెండు దూడలేనిదొకటి


* దూడలేని గేదెవద్ద మూడు బంగరు మూటలు, రెండు ఎప్పుడూ మిగలలేదు ఒకటి ఎప్పుడూ వాడలేదు


* వాడని మూటకు ముగ్గురు సాక్షులు, ఇద్దరు గుడ్డివాళ్ళు ఒకరికి కళ్ళే లేవు


* కళ్ళు లేనివాడికి మూడు రాజ్యాలు, బంజరు భూములవి రెండు జనాలు లేనిది ఒకటి


* జనాలు లేని ఊరుకొచ్చె కుమ్మరివాళ్ళు ముగ్గురు, వంకర చేతులదిద్దరు చేతులే లేవు ఒకరికి


* చేతుల్లేని కుమ్మరి చేసె మూడు కుండలు, కన్నాల కుండలు రెండు అడుగే లేదు ఇంకొకటికి


* అడుగులేని కుండలో ఉండె మూడు గింజలు, ఉడకబడనివి రెండు ఉడికించనిది ఒకటి


* ఉడికించనిదానికోసం వచ్చె ముగ్గురు చుట్టాలు, ఇద్దరు ఎప్పుడూ తినరు ఒకరికేమో ఆకలి లేదు


* ఆకల్లేనివాడికి మూడు కర్ర దెబ్బలు, రెండు దెబ్బలు తగల్లేవు ఒకటేమో తగలదు


ఇంకా చాలా ఉంది... వీలయ్యినప్పుడల్లా రాస్తుంటా !

-- ఇప్పుడు ఈ పాట చూసి ఆనందించండి



స్థూల, సూక్ష్మ, కారణశరీరాలు అంటే ఏమిటి?

గరుడపురాణం ప్రకారం మనిషి = ఆత్మ + 3 శరీరాలు + పంచకోశాలు + 3 అవస్థలు

స్థూలశరీరం:
పంచభూతాలతో నిర్మించబడినది ఈ భౌతిక శరీరంనే స్థూల శరీరం లేదా అన్నమయ శరీరం అంటాం.
స్థూల శరీరం=ఆకాశం+ వాయువు+ అగ్ని+ జలము+ పృథ్వి
ఇది ఆరు రకాల వికారాలు పొందుతుంది: పుట్టుక, ఉండడం, పెరగడం, మార్పు చెందడం, తరగడం, నశించడం

సూక్ష్మ/లింగ శరీరం: స్థూల శరీరాన్ని కదిలించేది ఈ సూక్ష్మ శరీరం.

సూక్ష్మ శరీరం=పంచప్రాణాలు + పంచ జ్ఞానేంద్రియాలు + పంచ కర్మేంద్రియాలు + మనస్సు + బుద్ధి

ప్రాణ పంచకం= ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు

జ్ఞానేంద్రియ పంచకం = త్వక్కు(చర్మం:వాయువు) + చక్షువు(కన్ను:అగ్ని)+రసన (నాలుక+జలం) + శ్రోతం(చెవి:ఆకాశం) + ఘ్రాణం(ముక్కు:భూమి)

కర్మేంద్రియ పంచకం = వాక్కు(ఆకాశం) + పాణి(వాయువు)+ పాదం (అగ్ని) + విసర్జకం/పాయువు (జలం), ఉపస్థ/జ్ఞానేంద్రియ (భూమి)

ఈ 17 మన విషయజ్ఞాన సముపార్జనకు తోడ్పడతాయి.

స్థూల శరీరాన్ని పట్టుకుని ఉండే ప్రాణశక్తి వలన మనం వాయువు పీల్చుకోవడం, ఆరగించడం, తిన్నది అరిగించుకోవడం, కదలికలు, వాహకం, నరాల శక్తి, ఎముకల కదలిక, మాంస, మజ్జ, ఇతరత్రా అన్నీ కూడా జరుగుతాయి.

అంత్యేష్టి సంస్కారం అయ్యాక స్థూలశరీరం పంచభూతాలలో కలిసిపోతుంది, జీవుడు మాత్రం ఈ లింగశరీరాన్ని ఆశ్రయించి ఉంటాడు.  ఉపనిషత్తుల వర్ణన ప్రకారం అంగుష్ఠమాత్రంగా హృదయంలో ఉన్న దీనిని లింగశరీరం అంటాము.

కారణ శరీరం: ఇది అనిర్వచనీయమైన శరీరం. మిగిలిన రెండు శరీరాలకు కారణభూతమైనది.

ఈ కారణశరీరం వల్లనే జీవునికి మరల వచ్చే జన్మలు ఆ జన్మల కారణాలు వాటిలో వచ్చే సుఖదుఃఖాలు నిర్ణయించేది. ఈ శరీరంలో మనస్సు బుద్ధి లేనందువలన కేవలం ఆనందం నివసిస్తుంది. సమాధి స్థితి, ఆధ్యాత్మిక ఉన్నతికి ద్వారం ఈ కారణ శరీరం. మన సంస్కారాలు, పూర్వ జన్మ వాసనలు అన్నీ నిబిడీకృతమై ఉంటాయి ఇక్కడ. 

జాగ్రదావస్థ యందు ఇంద్రియములతో చేసే కర్మల ఫలితాలను, వాసనారూపంలో కారణ శరీరంలో పొందు పరచబడి ఉంటాయి. ఇవి మరు జన్మకు కారణమవుతాయి. అలా మరుజన్మకు కారణమయ్యే వాసనలు దీన్లో ఉండటం వల్ల దీన్ని, కారణ శరీరమంటారు. కాని ఇది ఆత్మ కాదు. 

సుషుప్త్యావస్థలో (గాఢ నిద్రలో) ఇంద్రియాలు మనస్సులో లీనమై ఉంటాయి. అంచేత అవి పనిచెయ్యక, బాహ్య అనుభవాలు మనకు రావు. ప్రాణ శక్తులు మాత్రమే పనిచేస్తుంటాయి. ఈ ప్రాణమే  గాఢనిద్రలో శరీరం యొక్క సమస్త వ్యాపారాలనూ నడిపిస్తుంది. 

మనస్సు 

ఇంద్రియవృత్తులు, మనస్సూ తనలో (ఆత్మలో) లీనమై ఉంటాయి. అలాంటి సుషుప్తిలో ఈ కారణ శరీరం మాత్రమే భాసిస్తుంది/ ఉంటుంది. సుషుప్తిలో ఏమీ తెలియదు. సుషుప్తి నుంచి లేచాక నేను బాగా నిద్రపోయాను అని తెలుసుకొనేది మనస్సు. 

ఆత్మ

ఈ మూడు శరీరాలకూ ఆత్మే సాక్షి. దేనితోనూ తాదాత్మ్యం చెందదు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు భిన్నంగా; స్వప్రకాశ రూపమై కర్తగా గాని , భోక్తగా గాని కాకుండా అన్నిటికీ చైతన్యాన్ని ఇచ్చే ఆత్మయే మహాకారణ శరీరం. ఇది గాఢనిద్రలో అనుభవంలోకి వచ్చే స్థితి. 
ఇదే తురీయావస్థ. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తీ స్థూలశరీర ధర్మాలు. స్థూలశరీరం- క్రియాశాక్తికీ , సూక్ష్మశరీరం- ఇచ్ఛాశక్తికీ , కారణశరీరం- జ్ఞానశక్తికీ ఆశ్రయాలుగా చెప్పబడ్డాయి. 

పుట్టుక ముందు, ఆత్మ అవ్యక్తమైన సూక్ష్మ, కారణ శరీరాలతో ఉంటుంది. మరణం తరువాత కూడా అది అవ్యక్త స్థితి లో ఉంటుంది. ఈ మధ్యలోనే అది వ్యక్తమవుతుంది.


మరణసమయంలో ఈ కారణ లింగ శరీరాలు స్థూల శరీరాన్ని విడిచి పెట్టి పోతాయి. గురువు దయ వుంటే మరల వెనుకకు రాకుండా పరమాత్మ వద్దకు పోగల మోక్షం లభిస్తుంది.




Referred and will add more from the below links:
1. http://andhrabhoomi.net/content/others-3426
2. https://www.mymandir.com/p/clp9n
4. http://ourreligionandculture.blogspot.com/2019/01/blog-post_31.html
5. http://sahitinandanam.blogspot.com/2017/01/blog-post_69.html



Saturday, May 16, 2020

బ్రాహ్మణ విద్వేషం - Stop hate politics , Stop scapegoating brahmins !

బ్రాహ్మణ విద్వేషం పెంచి హిందువులను కులాల వారిగా విడగొట్టి, ఒకరిపై ఒకరికి విద్వేషం పెంచి, ఓట్లు చీల్చి, మందబుద్ధిగాడిని అందలం ఎక్కించాలని కొంతమంది, మతం మార్చాలని కొంత మంది, ఈ సందట్లో హడావిడి చేసి గొప్పోళ్ళయి పోవాలని, పబ్బం గడుపుకోవాలని ఇంకొంతమంది విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు.

కులాల మధ్య సామరస్యం సంస్కారం లేకపోతే ఇన్ని వందల సంవత్సరాలు భారతదేశంలో ఇలాంటి కట్టుబాటు ఎలా నిలబడుతుంది ?
వృత్తుల నుండి ఇప్పుడు మనం కులం అని పిలుస్తున్న ఒక కట్టుబాటు ఒక్క రోజులో వచ్చింది కాదు. ఒక రోజు హటాత్తుగా వచ్చేసి ఈ రోజు నుంచి నేను బ్రాహ్మడను, నువ్వు కమ్మ, నువ్వు రాజు, వాడు కాపు నువ్వు అంటరానివడివి అంటే ఊరుకుంటాడా ఎవడైనా?
అడవుల్లో గిరిజనుల్లా గుంపులుగా సంచారులుగా వేటాడుకుంటూ, బతికే వాళ్ళకి కులం ఎందుకు కావాలి? కండ బలం ఉంటే ఏ జంతువు నో వేటాడొ, ఏ చెట్టెక్కి కాయలు కోసుకుతినో బతికెయ్యొచ్చుగా?
యుద్ధాలు చేసి రాజెందుకు చావాలి? ఓడిపోతే వాడి కుటుంబం మొత్తం ఎందుకు జనం కోసం చచ్చిపోవాలి?
అర్థరాత్రి అపరాత్రి తేడా లేకుండా కాపెందుకు కాపు కాయాలి? కమ్మ ఎందుకు ఒళ్ళు హూనం చేసుకు వ్యవసాయం చెయ్యాలి? అసలు కమ్మరి,కుమ్మరి,శెట్టి,పద్మశాలి,గౌడ ఇలా వృత్తులు ఎందుకు చెయ్యాలి?
చివరగా.. అడవిలో మనుగడకు అవసరమైన కండబలం, ఎండలో తిరిగి, కాయ కష్టం చేస్తే వచ్చే రోగనిరోదక శక్తీ వదులుకుని, మందు విందు పొందు తప్పు కాని రోజుల్లో మడి కట్టుకుని ఇంట్లో ముక్కుమూసుకుని కూర్చుని జపం చేసుకోవల్సిన పరిస్తితి బ్రాహ్మణుడికి ఎందుకు ? కొంత మంది పనికి మాలినోళ్ళ చేత సోమరిపోతులు అనిపించుకోడానికా?

1. మనిషి ప్రకృతి పరంగా ఒక జంతువు, తన ప్రాణానికి మించి ఏది ముఖ్యం కాదు అన్నది మనకు సహజ ప్రవృత్తిగా పుట్టుకతో వస్తుంది
2. తదనుగుణంగా బ్రతకడానికి కావాల్సిన తిండి, గూడు ప్రాముఖ్యం అవుతాయి
3. జంతువులకు మరణ భయం ఉంటుంది కానీ చావు అంటే అర్థం చేసుకునే ఆలోచనా శక్తి ఉండదు కాబట్టి అవి అంతరించిపోకుండా ప్రకృతి సంభోగం పిల్లల సం రక్షణ లాంటివి కూడా సహజ సిద్ధంగా వస్తాయి

ఈ మూడింటి గురించి కలిగే అభద్రతా భావాలను అధిగమించిడం కోసం, తరువాత స్తితిలో దైనందన జీవితం సుఖమయం చేసుకోవడం కోసం మనిషి సాంఘీకపరమైన కట్టుబాట్లు, ఆచారాలూ వృత్తులూ కనిపెట్టుకుంటూ వచ్చారు. ఇప్పటి మోడల్ విలేజ్ లా, స్వావలంబన కలిగిన వ్యవస్థ కోసం ప్రయత్నించారు. దానిలో భాగంగానే వృత్తుల కులాలు పుట్టాయి.
వ్యవసాయం ఒక పెద్ద శాస్త్రం, అది ఒకరి నుంచి ఒకరు, పని చేస్తూ నేర్చుకోవలసిందే ! ఎంతో ప్రేమాభిమానాలు ఉంటే తప్ప నేర్పించేవాళ్ళు నేర్చుకునే వాళ్ళకు కిటుకులతో సహా నేర్పించలేరు, అది మనవ సహజం. జ్ఞానం క్షీణించిపోకుండా ఉండాలని వృత్తుల కుటుంబాలు మొదలయ్యాయి. తండ్రి నుంచి కొడుక్కి, మామ నుంచి అల్లుడికి నైపుణ్యం అబ్బింది. ఇంట్ళో ఉండేవాడు మందు తాగితే 24 గంటలూ అదే పనిలో ఉంటాడు. పొలంలో పనిచేసేవాడి తిండి వేరే. ఆడవాళ్ళ పాత్ర 60% కన్నా ఎక్కువ, అది వేరే వ్యాసమే అవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే, కుటుంబం లో అందరూ మానసికం గా అందంగా, శారిరకంగా బలంగా ఉండాలంటే ఎం చెయ్యాలో ఎం తినాలో ఎలాంటి అలవాట్లు ఉండాలో అవి నిర్ణయించేది ఆడవాళ్ళే, అప్పటి ఆరెంపీ డాక్టర్లు.
కుల వృత్తులు, కుల పెళ్ళిళ్ళూ అలా పుట్టినవే.
కాల క్రమేణా ఒక గౌడ చెట్టు ఎక్కినట్టు ఒక కమ్మ వ్యవసాయం చేసినట్టు వేరే కులం వాళ్ళు చెయ్యలేకపోయారు. కులాలు మరింత బలంగా మరింత సమర్ధవంతంగా పనిచేశాయి. ఒకటో తరగతి నుంచి పీహెచ్ డీ దాకా చదివినట్టు నైపుణ్యం పెరిగిపోయింది. అలాగే వైద్యం, న్యాయం మొదలైన శాస్త్రాలు పుట్టుకొచ్చాయి.

మనం మాట్లాడుకున్న ముఖ్యమైన మూడు కీలక మైన అవసరాలు తీరిపోతే, నిబద్ధత లేని మనిషికి, ఈర్ష్య, దురాశ వంటివి ప్రకోపిస్తాయి. అటువంటి వారి వల్ల రాజ్యాల మధ్య, తెగల మధ్య, కులాల మధ్య, కుటుంబాల మధ్యా సమస్యలు మొదలయ్యాయి. అవి తీర్చడానికి అందరి కన్నా బలవంతుడు అవసరమయ్యాడు. కండబలం, మంది బలం, ధనబలం ఉన్నవాడు రాజయ్యాడు. బుద్ధిబలం కూడా తోడైతే మహా రాజయ్యాడు.
ఇక కళలు- సంగితం, చిత్రలేఖనం లాంటివి ఊపందుకున్నాయి. వ్యాపారం చేసే కోమట్లూ వచ్చారు.
ఇన్ని కులాలు ఇంత నైపుణ్యం ఇంత జ్ణానం ఒక్క ప్రకృతి వైపరిత్యం తోనో, మహమ్మారి తోనో యుద్ధం తోనో తుడిచి పెట్టుకుపోకూడదని, అంచేలంచలుగా ఎదగాలనే సదుద్దేశంతో ఒక లైబ్రెరియన్లా బ్రహ్మణులను స్రుష్టించారు. అంతవరకు ఉన్న జ్ఞానాన్నంతా వేదాలుగా విభజించి, అవి పతనమవ్వకుండా వేద విధ్యా విధానం స్రుష్టించి, అంత పెద్ద జ్ఞాన భాండారాన్ని దేశం నలుమూలలా వ్యాపింప చేశారు బ్రాహ్మణులు. రాజ్యం రాజు దెగ్గర, వ్యవసాయం కమ్మ దెగ్గర అలా ఎవరి వృత్తులు వారి దెగ్గర ఉన్నట్టే విద్య బ్రాహ్మణుల దెగ్గర ఉండి పోయింది. ఐతే లక్ష్మి, విద్య ఒక చోట ఉండకూడదు, ఒక్కరికే బలం ఎక్కువ అయ్యిపోతుంది అని, బ్రాహ్మణులను ధన సముపార్జన పై మక్కువ చూపకుండా, రాజ్యాలు ఏల కుండా, విద్య పై శ్రద్ధ పోకుండా ఉండటానికి కావాల్సిన కట్టడులన్నీ కూడా చేసారు. బ్రాహ్మణులు స్వేచ్చ కోల్పోయారు.
ఒక్క సంవత్సరం పాటు 6 సబ్జక్టులు, టెక్స్త్ బుక్, నోట్ బుక్, హోం వర్క్, వర్క్ షీట్స్, ట్యూషన్స్ అని సదుపాయాలు కల్పిస్తే 100 కి 50 మందికి కుడా 100 రావు.
లక్షల స్లోకాల వేదాలు ఆపై ఉపనిషత్తులు పురాణాలు, సహశ్రావధానాలు కేవలం విని, గుర్తు పెట్టుకుని, మళ్ళీ చదివి వాటి మిద మళ్ళీ వాఖ్యానాలు రాసి బ్రాహ్మణులు ఎంత కష్టపడుంటారు?
ఇన్ని చేసినా అధికార దుర్వినియోగం అన్ని కులాల్లోనూ జరిగింది, స్వార్ధపరులైన వాళ్ళు ఒక్క కులం లోనే పుట్టాలని ఏమి లేదు. ఎవ్వరికి తోచింది వాళ్ళు చేసుకున్నారు.
అలాంటి వారి వల్లా, పరాయి పాలన వల్లా మన వృత్తులు ఎదగలేదు, మరుగున పడి పోయాయి, మన వేదాలు అక్కడే ఉండి పోయాయి. వాటి విలువ పడిపోయి కొత్త సాంకేతిక విద్య విలువ పెరిగింది, విద్యకు అధిపతులుగా కొన్నాళ్ళు బ్రహ్మణులు సాంకేతిక విద్య నేర్చుకున్నా తరువాత కాలం లో అది పోయింది, రాజుల రజ్యాలు పోయాయి, భూపతుల భూములు ప్రభుత్వాలకు వెళ్ళాయి.
ఈ మొత్తం లో ఏ ఒక్క కులం ని ఎలా తప్పు పడతాం? తిలా పాపం తలా పిడికెడు.
మా తాతలు చెప్పులు మోశారు, మీరు ఇప్పుడు అనుభవించండి అంటే అది ఎలా న్యాయం? మా తాతలు కష్టపడ్డారు, అందరి తాతలు అప్పటి కాలానికి సరిపడ కష్టపడ్డారు.

హిందువులు ఇలా అనవసరంగా ఒకరినొకరు చులకన చేసుకుంటే మనం కూర్చున్న కొమ్మ మనమే నరుక్కున్నట్టు ! జరిగిపోయినదాన్ని పక్కన పెట్టి ఇప్పుడు అందరికీ జరగాల్సిన న్యాయం గురించి ఆలోచించాలి. చెప్పుడు మాటలు విని తప్పుడు వాళ్లను సమర్ధిస్తే అందరికీ నష్టమే ! ఏదైనా కులాన్ని కించపరిచే లా మాట్లాడేటప్పుడు ఒక్క సారి అలోచించండి. అందరిని కలిపి అనొద్దు. అసలు కుల ప్రస్తావనే వద్దు. కాలం మారిపోయింది ఇవాళ కాకపోతే రేపైనా ఈ కులాలు పూర్తిగా పోతాయి. లోకువయ్యిపోతే మత్రం మన అస్తుత్వమే పోతుంది, మన భారత సంప్రదాయాలు, కళలు, ఆచారాలు గొప్పవి., కాని శాస్త్రీయ సంగీతంలో ఫ్యూజన్ వచ్చినట్టు కొన్ని మార్పులు జరగాలి అవి సమ్యమనం తో మార్చుకుంటే సరిపోతుంది. పాత వారిని వదిలెయ్యండి, మన జనరేషన్లో దురాచారాలు పాటించేవారు ఎవరూ ఉండరు.

#brahmin #hinduism